ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “డైమండ్ డెకాయిట్” చిత్రం ఈ నెల ఏప్రిల్ 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమా ఆస్వాదించాలని చిత్ర బృందం కోరుతోంది. ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్గా నటించారు. రచయిత–దర్శకుడు సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సందర్భంగా హీరో–నిర్మాత పార్ధా గోపాల్ మాట్లాడుతూ:“డైమండ్ డెకాయిట్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి” అని అన్నారు.











