సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీరామ్ తపస్వి రాసిన ‘పట్టుకో బాబా’ పాటను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించి, టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ… “చంద్ర మహేష్ గారు అప్పట్లో తీసిన బ్లాక్ బస్టర్ ‘ప్రేయసి రావే’ కి నేను రైటింగ్ అసిస్టెంట్ గా పని చేశాను. ఆ తర్వాత ఆయన తీసిన మరికొన్ని చిత్రాలకు కూడా నేను పని చేశాను. అందుకే ఈ పాటను ఆవిష్కరిస్తున్నందుకు చాలా ఆనంద పడుతున్నాను. ఇవాల్టి యువతరం ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, తల్లితండ్రులతో వాళ్ళకున్న కమ్యూనికేషన్ గ్యాప్ ని చర్చిస్తూ రిలేషన్ షిప్స్, అండర్స్టాండింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. దర్శకుడు చంద్ర మహేష్ గారి సెన్సిబిలిటీస్ గురించి నాకు తెలుసు. ఒక ఫీల్ ని ఎంత ఇంపాక్ట్ గా చెబుతారో ‘ప్రేయసి రావే’ టైంలోనే చూశాను. ఆ సినిమా క్లైమాక్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. ఆ రోజులు నాకిప్పటికీ గుర్తున్నాయి. ‘ప్రేయసి రావే’ లాగా అదే ఫీల్ తో ‘పిఠాపురంలో’ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. చంద్ర మహేష్ కి పెద్ద విజయం దక్కాలని నా ఆకాంక్ష” అని చెప్పారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని ఏరియాల పంపిణీదారులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీ తో సహా సిద్దమయింది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు. కొరటాల శివ లకు మహేష్ చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.











