జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికలకు ముందు అధికారంలో లేరు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అందుకే ఏ రకమైన విమర్శలు చేయడానికైనా ఎన్నికల సమయంలో వీలవుతుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి పవన్ చేతిలో ఉన్న పవర్ అస్త్ర మాత్రం పవర్ అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు జగన్ ను విమర్శిస్తే కుదరదు. కేవలం కూటమి ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించే చెప్పుకుని ప్రజల ముందుకు వెళ్లాలి. అతి అంత సులువు కాదు. ఎప్పుడైనా నెగిటివ్ వ్యాఖ్యలకు ఉన్న పాజిటివిటీ ప్రజల్లో పాజిటివ్ కామెంట్స్ కు ఉండదు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారికి ఎవరికైనా ఇలాగే అర్థమవుతుందిఅందుకే పవన్ కొత్త అస్త్రాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు జనసేన క్యాడర్ తో పాటు కాపు సామాజికవర్గం కూడా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఇప్పటికే పలు మార్లు పవన్ కల్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. దీంతో ఆ అస్త్రం కూడా పవన్ చేతులో లేదు. ఇక కూటమి ప్రభుత్వం రెండోసారి ఎన్నికైతే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది చప్పగా ఉంటుంది. తప్పించి ప్రజలకు రుచించదు. జగన్ ను విమర్శించినా, వైసీపీ పాలనలో లోపాలను ఎత్తి చూపినా అవుట్ డేటెడ్ అవుతాయి. అందులోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనూ చివరకు రాజధాని అమరావతి రైతుల అవస్థల విషయంలోనూ పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారనుంది.
ఇక ఆయన నిజాయితీపరుడైనా సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలోనూ వ్యతిరేక వార్తలు వస్తుండటంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ జనం వద్దకు వెళ్లాలంటే ఏం చేయాలన్న దానిపై కొంత తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటంతో అనేక విషయాలు కలసి వస్తాయని నమ్ముతున్నారు. అన్నీ కలసి వచ్చి తమను రెండోసారి అధికారంలోకి తెస్తాయని భావిస్తున్నారు. మరి జరుగుతుందన్నది చూడాలి.
రైతుల కోసం వ్యూహం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతగా వ్యవహరిస్తారు. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు. తాను కూటమిలో కీలక భాగస్వామి అని.. తన మాటే చెల్లుబాటు అవుతుందని ఎన్నడూ చెప్పరు. అయితే ఈ విషయంలో జనసైనికులు భిన్నంగా ఉంటారు. తమ నేత వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని మాట్లాడుతుంటారు. అయితే ఆ మాటలు కూటమికి ఇబ్బందికరం అని పవన్ కళ్యాణ్ కు తెలుసు. అందుకే అటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు పవన్ కళ్యాణ్. తాజాగా కోనసీమలో కొబ్బరి రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్. అక్కడ ఉప్పు నీటితో కొబ్బరి పంటకు నష్టం జరుగుతుందని తెలిసి పరామర్శకు వెళ్లారు.
ఇలా వెళ్లే క్రమంలో చాలా బాధ్యతగా మాట్లాడారు. తాను ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించే ముఖ్యమంత్రి హోదాలో లేనన్న విషయాన్ని గుర్తు చేసి.. సీఎం చంద్రబాబుతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు.వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు వ్యవస్థలను వెంటాడుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదనతో ఉన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు డబ్బులు ఇస్తే చాలదని.. వారు పడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా గత ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసి పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు.
అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తద్వారా గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో వెంటనే తాను పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేస్తానని అతిగా హామీ కూడా ఇవ్వలేదు.అయితే తాను సీఎం హోదాలో లేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఆశిస్తున్నారని ప్రచారం చేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వం కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలను పట్టించు కోలేదన్నది పవన్ ఆవేదన.
సీఎం చంద్రబాబుతో చర్చించి ఆ సమస్యకు పరిష్కారం మార్గం చూపుతానని చెప్పే క్రమంలో బాధ్యతగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు మరిచి.. ఎంత మాత్రం తాను సీఎం పదవిలో లేనని చెప్పిన మాటను హైలెట్ చేస్తోంది. అయితే కూటమి మరో 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందని పవన్ చెప్పిన మాటను ఆయన అక్షరాల పాటిస్తున్నారు. మొన్న ఆ మధ్యన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా తీశారు. ఇప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించే క్రమంలో.. సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతతో మెలుగుతున్నారు.











