తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ (2BHK) ఇళ్ల దుర్వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ లబ్ధిదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఈ ఇళ్లను లబ్ధిదారులు ఎవరైనా అమ్మకానికి పాల్పడితే.. వారిపై ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (POT) యాక్ట్ ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎండీ గౌతమ్ హెచ్చరించారు.
దాంతో పాటు అటువంటి ఇళ్లను ప్రభుత్వం వెంటనే, ఎటువంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. ఈ ఇళ్లు పేదల నివాస అవసరాల కోసం మాత్రమే ఇచ్చారని.. వాటిని అమ్ముకునే లేదా ఆర్థిక లాభం పొందే హక్కు లబ్ధిదారులకు లేదని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కేవలం అమ్మకాలు మాత్రమే కాకుండా.. వాటిని అద్దెకు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమేనని ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. ఒకవేళ లబ్ధిదారులు ఈ ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లుగా తనిఖీల్లో తేలితే, వారికి ఇచ్చిన ఇంటి కేటాయింపును తక్షణమే రద్దు చేస్తామని వెల్లడించారు.
ఈ ఇళ్లు లబ్ధిదారులు నివసించడానికి ఉద్దేశించినవి తప్ప.. వాటిని అద్దె వ్యాపార సాధనంగా మార్చుకోవడానికి కాదని అధికారులు స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అక్రమ విక్రయాలు, అద్దెలపై అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అమ్మకాలు, అద్దెలపై అధికారులు సర్వే పూర్తి చేశారు. త్వరలోనే ఈ సర్వే కార్యక్రమాన్ని జిల్లాల పరిధిలో కూడా విస్తరిస్తామని ఎండీ గౌతమ్ తెలిపారు. ఈ సర్వేలో అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కొల్లూరు, రాంపల్లి వంటి ప్రాంతాలలో ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇచ్చిన ఇళ్లను కొందరు లబ్ధిదారులు గుట్టు చప్పుడు కాకుండా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఉల్లంఘనలు ప్రభుత్వ ‘ప్రతి పేదవాడికి సొంత ఇల్లు’ అనే లక్ష్యాన్ని దెబ్బతీయడమే కాక, వేలాది మంది నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నాయి.అందుకే, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. POT చట్టం వినియోగం, కేటాయించిన ఇళ్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.











